కరోనాతో కన్నుమూసిన సినీ నటుడు వేణుగోపాల్

తెలుగు సినీ పరిశ్రమ మరో నటుడిని కోల్పోయింది. ప్రముఖ నటుడు కోసూరి వేణుగోపాల్ గత రాత్రి కరోనాతో కన్నుమూశారు. కరోనా మహమ్మారి బారినపడిన ఆయన 23 రోజుల క్రితం గచ్చిబౌలిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. చికిత్స అనంతరం నిర్వహించిన పరీక్షల్లో నెగటివ్ అని నిర్ధారణ అయింది. అయినప్పటికీ ఆయన కోలుకోకపోవడంతో వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించారు. పరిస్థితి మరింత విషమించడంతో గత రాత్రి తుదిశ్వాస విడిచారు.

పశ్చిమగోదావరి జిల్లా నరసాపురానికి చెందిన వేణుగోపాల్ ఎఫ్‌సీఐలో మేనేజర్‌గా పనిచేసి రిటైర్ అయ్యారు. మర్యాద రామన్న, పిల్లజమిందారు, చలో వంటి సినిమాల ద్వారా మంచి గుర్తింపు పొందారు. తాజాగా అమీతుమీ సినిమాలో నటించారు. వేణుగోపాల్‌కు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఆయన మృతి విషయం తెలిసిన టాలీవుడ్ తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. ఇటీవల మరో ప్రముఖ నటుడు జయప్రకాశ్‌రెడ్డి గుండెపోటుతో మృతి చెందిన విషయం విదితమే.

Kosuri Venugopal
Tollywood
Actor
Hearattack
Passes away

More Telugu News